అనుమానం రావద్దని అంత్యక్రియలకు వెళ్లి అడ్డంగా దొరికిపోయిన హంతకుడు.. బిహార్ లో ఘటన


 బిహార్ బీజేపీ నేత గోపాల్ ఖేమ్కా హత్య కేసులో నాటకీయ పరిణామం

మృతుడి అంత్యక్రియలకు హాజరైన నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు రోషన్ కుమార్‌ను గుర్తించిన వైనం

హత్యకు ముందు ఖేమ్కా కదలికలను ఇద్దరు వ్యక్తులు ట్రాక్ చేసినట్లు వెల్లడి

ANDHRAPRADESH:బిహార్‌లో సంచలనం సృష్టించిన బీజేపీ నేత గోపాల్ ఖేమ్కా హత్య కేసులో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. తనపై ఎవరికీ అనుమానం రాకూడదన్న ఉద్దేశంతో నిందితుడు ఏకంగా మృతుడి అంత్యక్రియలకు హాజరై పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా అతడిని గుర్తించిన పోలీసులు, అంత్యక్రియలు జరుగుతున్నప్పుడే అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఖేమ్కా అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో నిందితుడు కూడా ఉన్నాడు. పట్నాలోని పున్‌పున్‌ ప్రాంతానికి చెందిన రోషన్ కుమార్ అనే వ్యక్తి ఖేమ్కా భౌతికకాయానికి నివాళులర్పించేందుకు పూలదండతో వచ్చాడు. అప్పటికే సీసీటీవీ ఫుటేజీ ద్వారా అతడిని గుర్తించిన పోలీసులు, అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ముందు బాధితుడితో కలిసి ఓ టీ దుకాణం వద్ద కూర్చున్నట్లు నిందితుడు విచారణలో అంగీకరించినట్లు సమాచారం.

ప్రాథమిక దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు ముందు ఇద్దరు వ్యక్తులు ఖేమ్కా కదలికలను నిశితంగా గమనించినట్లు పోలీసులు గుర్తించారు. ఆయన బంకిపూర్ క్లబ్ నుంచి బయలుదేరినప్పుడు ఒక వ్యక్తి హంతకులకు సమాచారం అందించగా, గాంధీ మైదాన్‌లోని బిస్కోమన్ టవర్ వద్ద ఉన్న మరో వ్యక్తి, ఖేమ్కా నివాసానికి చేరుకుంటున్నట్లు అప్రమత్తం చేశాడని పోలీసులు తెలిపారు. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

శుక్రవారం రాత్రి పట్నాలో గోపాల్ ఖేమ్కా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ హత్య రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. నీతీశ్ కుమార్ పాలనలో బిహార్ ‘నేర రాజధాని’గా మారిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించగా, రాష్ట్రంలో వ్యాపారులకు రక్షణ కరువైందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు
Author

Shakir Babji Shaik

Editor | Amaravathi

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now