మహారాష్ట్ర తీరంలో విదేశీ బోటు.. హైఅలర్ట్!

 

రాయ్‌గఢ్ లో భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు

తీరానికి రెండు నాటికల్ మైళ్ల దూరంలో గుర్తింపు

రంగంలోకి దిగిన నేవీ, కోస్ట్ గార్డ్, పోలీసు ప్రత్యేక బృందాలు

ప్రతికూల వాతావరణంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం

ANDHRAPRADESH:మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా తీరంలో ఓ అనుమానాస్పద పడవ కనిపించడం తీవ్ర కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆదివారం తీరప్రాంతం వెంబడి భద్రతను కట్టుదిట్టం చేసి హైఅలర్ట్ ప్రకటించారు. రేవ్‌దండా తీరంలోని కోర్లాయి ప్రాంతానికి సుమారు రెండు నాటికల్ మైళ్ల దూరంలో ఈ పడవను భద్రతా సిబ్బంది గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ పడవపై మరో దేశానికి చెందిన గుర్తులు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఇది రాయ్‌గఢ్ తీరానికి కొట్టుకు వచ్చి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సమాచారం అందిన వెంటనే రాయ్‌గఢ్ పోలీసులు, బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (బీడీడీఎస్), క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్‌టీ) బృందాలతో పాటు నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా పడవ వద్దకు వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలకు ఆటంకం కలిగింది. బార్జ్ సహాయంతో పడవను సమీపించేందుకు ప్రయత్నించినా, వాతావరణం అనుకూలించకపోవడంతో వెనుదిరగాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా, ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించి జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
Author

Shakir Babji Shaik

Editor | Amaravathi

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now