రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలి – నెల్లూరులో వైసీపీ మహిళా నేతల ఫిర్యాదు


ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా సర్వేపల్లి, BCN NEWS: నియోజకవర్గం పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నేతలు కలిసి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత మాట్లాడుతూ రాధాకృష్ణ మహిళలపై చేసిన వ్యాఖ్యలు అసభ్యకరంగా, అవమానకరంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.


మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన రాధాకృష్ణను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆమె కోరారు. జర్నలిజం విలువలను పక్కనబెట్టి కక్షపూరిత ధోరణితో దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని విమర్శించారు.

రాధాకృష్ణ వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగతంగా కాకుండా మొత్తం మహిళా సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని, ఇలాంటి చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

జర్నలిజం అంటే బాధ్యతతో నిజాలను వెలికితీయడం గానీ, వ్యక్తిగత దూషణలు చేయడం కాదని, మహిళలపై అసభ్యంగా మాట్లాడటం దురదృష్టకరమని పేర్కొన్నారు. మహిళల మనోభావాలు దెబ్బతిన్న ప్రతి చోటా ఫిర్యాదులు అందజేస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే రాధాకృష్ణ మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని కూడా కోరారు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now